అన్ని రంగాల్లో వెనుకబడిన కాపుల ఆకలి తీర్చేందుకే తన ఉద్యమమని ప్రముఖ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు.. తునిలో జరిగిన విధ్వంసంపై ఆయన విచారం వ్యక్తం చేస్తూ క్షణికావేశంలో మాత్రమే జరిగిందని అన్నారు.. కిర్లంపూడిలో ఆయన నేటి ఉదయం మీడియాతో మాట్లాడుతూ, కాపులను రౌడీలుగా చిత్రించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ పరోక్షంగా టిడిపి నేతలను విమర్శించారు..కాపులను బిసి లలో చేర్చాలనే డిమాండ్ ఈనాటిది కాదని, ఇప్పడు తాజాగా పుట్టుకొచ్చింది కాదని ఆయన గుర్తు చేశారు..ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా ఉన్న ఈ సమస్యను సాధ్యమైనంత తర్వగా పరిష్కరించాలనే ఉద్దేశ్యంతోనే తాను ఉద్యమం చేపట్టానని పేర్కొన్నారు.. తాను ఏ పార్టీకి, ఏవరికీ అమ్ముడు పోలేదని తేల్చి చెప్పారు..
కాపుల మనుగడ కోసం నిరంతరం శ్రమిస్తానని అన్నారు. ఈ రోజు తాను చేపడతానన్న దీక్షను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు చెప్పిన ఆయన త్వరలో తాను, తన కుటుంబ చేపట్టే నిరశన దీక్ష వివరాలను వెల్లడిస్తానని తెలిపారు. తాను ఏ కులానికి, మతానికి వ్యతిరేకం కాదని, అదే సమయంలో అనుకూలం కాదని ముద్రగడ స్పష్టం చేశారు. తక్షణం కాపులను బిసిల జాబితాలో చేరిస్తే కాపు యువతకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు.. ఆ దిశగానే ప్రభుత్వం కాలయాపన చేయకుండా కాపులను బిసిలో చేర్చాలని కోరారు.
కాపులను బీసీల్లో చేర్చే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే నాలుగైదు రోజుల్లో తాను నిరశన దీక్ష చేపడతానని ముద్రగడ పద్మనాభం చెప్పారు. కాపుల ఆకలి పోరాటం తీర్చడానికే ఉద్యమం చేపట్టామని ఆయన అన్నారు. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీ లబ్ధి కోసమో కాదని ఆయన అన్నారు.
కాపులను బీసీలలో చేర్చాలని కోరుతూ తాను చేపట్టిన ఉద్యమం రాజకీయాలకు అతీతమని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన ఆయన తాము ఏపార్టీకి చెందిన వారం కాదనీ, ఏ పార్టీ మద్దతూ కోరలేదనీ స్పష్టం చేశారు. తమ జాతికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే ఈ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. తుని పట్టణంలో నిన్న జరిగిన సంఘటనలకు రాష్ట్రప్రభుత్వమే బాధ్యత వహించాలని ముద్రగడ స్పష్టం చేశారు.