అరె.. పొన్నాలని పట్టించుకోరే.. !


పొన్నాల లక్ష్మయ్య.. కాంగ్రెస్ సీనీయర్ నేత. మాజీ పిసీసీ చీఫ్. ఇప్పుడీ సీనియర్ నేతకి టికెట్ దొరకడమే కష్టంగా మారింది. ఆయన సొంత నియోజకవర్గం జనగాం స్థానాన్ని మహాకూటమి పొత్తుల్లో భాగంగా టీజె ఎస్ కి వెళ్లనట్టు ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుంచి కోదండ రాం బరిలో దిగుతారని చెప్పుకొంటున్నారు. ఈ ప్రచారంపై పొన్నాల ఫైర్ అయ్యారు. అసలు ఇంకా అభ్యర్థులనే ఖరారు చేయలేదు. అలాంటప్పుడు ఇలాంటి ప్రచారం వల్ల పార్టీకి నష్టం చేకూరుతుందన్నారు.

నిజంగానే జనగాం స్థానాన్ని టీజె ఎస్ కేటాయిస్తే.. తాను అధిష్టానంతో మాట్లాడుకొంటానని చెబుతున్నారు. ఎందుకంటే ? ఆయన సొంత పార్టీ నేతలపై నమ్మకం లేదు. పొన్నాల పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు ఆయనకి పుల్లలు పెట్టి మరీ దింపేశారు. అంతేకాదు.. ఇప్పుడు పొన్నాల నియోజవర్గం జనగాంపై జరుగుతున్న ప్రచారాన్ని ఏ ఒక్క సీనియర్ నేత ఖండించలేదు. ఈ నేపథ్యంలో పొన్నాల సామాజిక వర్గం మున్నూరు కాపు నేతలు నిరాశకి గురవుతున్నారు. అసలే తెలంగాణ కాంగ్రెస్ లో రెడ్డి సామాజిక వర్గానిదే హవా.. కొద్దో గొప్పో ఉన్న బీసీ నేతలని ఇలా టికెట్స్ ఇవ్వకుండా తొక్కేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.