యూపీఐ ఛార్జీలపై NPCI క్లారిటీ..


యూపీఐ చెల్లింపులపై అదనపు చార్జీలు వసూలు చేస్తారనే వార్తలు ఇటీవల వైరల్ అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ఆన్‌లైన్ వాలెెట్లు, ప్రీ లోడెడ్‌ గిఫ్ట్ కార్డుల వంటి ప్రీపెయిడ్ పేమెంట్స్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ ( PPI ) ద్వారా చేసే యూపీఐ మర్చంట్ లావాదేవీలపై అదనపు ఛార్జీలను విధించాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ప్రతిపాదించింది. ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురానున్నారు. అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌ 30న లేదా అంతకంటే ముందే వీటిపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. రూ. 2000కు పైబడిన లావాదేవీ విలువలో 1.1 శాతం మేర ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జ్‌ వసూలు చేయాలని NPCI సూచించింది. అదనపు ఛార్జీలు అమల్లోకి వస్తే వాలెట్ లోడింగ్‌కు సేవా ఛార్జీని బ్యాంక్‌కు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎన్‌పీసీఐ ఈ కొత్త ప్రతిపాదనల్ని ఆర్బీఐకు సమర్పించింది. ఆర్బీఐ ఈ ప్రతిపాదనల్ని ఆమోదిస్తేనే ఈ చార్జీలు అమల్లోకి వస్తాయి.

అయితే యూపీఐ (UPI)తో జరిపే ప్రతి లావాదేవీపై అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని చాలా మందిలో సందేహం నెలకొంది. కానీ, దాంట్లో వాస్తవం లేదు. వ్యక్తుల మధ్య, వ్యక్తి నుంచి వ్యాపారుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి అదనపు రుసుము ఉండదు. సామాన్య ప్రజలు రోజువారీ చెల్లింపుల కోసం యూపీఐ యాప్‌లను వినియోగిస్తే ఎలాంటి అదనపు రుసుము వర్తించదు.

ఇకపోతే ఈ ఇంటర్‌ఛేంజ్‌ ఛార్జీల వల్ల సామాన్యులపై భారం పడొచ్చంటూ అనేక సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్‌పీసీఐ స్పష్టతనిచ్చింది. బ్యాంకు ఖాతా నుంచి ఖాతాకు, వినియోగదారులకు-వ్యాపారులకు మద్య ఉచితంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఇంటర్‌ చేంజ్‌ ఛార్జీలు పీపీఐ వ్యాపారి లావాదేవీలకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. అంటే వ్యక్తుల మధ్య, వ్యక్తి నుంచి వ్యాపారుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి అదనపు రుసుములు ఉండవు. ఇదే విషయాన్ని పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ సైతం స్పష్టం చేసింది.