కనకదుర్గమ్మ సేవలో మోహన్ భగవత్

 

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఏపీకి వచ్చారు. అంతేకాదు ఈరోజు విజయవాడలోని కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో అఖిల భారత ప్రచారక్‌ల సమావేశం  నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు మోహన్‌ భగవత్‌ విజయవాడ విచ్చేశారు. అందులో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.

కాగా మోహన్ భగవత్ కనకదుర్గమ్మను దర్శించుకొనేందుకు ఆలయ సిబ్బంది దేవస్థానం మర్యాదలతో మోహన్‌ భగవత్‌, ఇతర ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులను సాదరంగా ఆలయంలోకి తోడ్కొని వెళ్లారు. సంప్రదాయ వస్త్రధారణలో మోహన్ భగవత్ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. వేద పండితుల ఆశీర్వాదం తర్వాత ఆలయ కార్యనిర్వాహక అధికారి వి.కోటేశ్వరమ్మ వారికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందించారు. జగన్మాత దర్శనం చాలా ఆనందాన్ని ఇచ్చిందని  మోహన్ భగవత్ వివరించారు.