నాలుగేళ్లు చూశాం.. ఇక కీలక నిర్ణయం

ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ 2018పై మిత్ర పక్షం టీడీపీ చాలా ఆగ్రహంతో ఉంది. బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపు కాదు కదా, కనీసం బడ్జెట్‌ ప్రసంగంలో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్‌ పదం కూడా కనిపించలేదు. దాంతో టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత కొన్నాళ్లుగా బీజేపీ మరియు టీడీపీల మద్య వార్‌ జరుగుతున్న విషయం తెల్సిందే. తాజాగా బడ్జెట్‌ తర్వాత తెలుగు దేశం పార్టీ నాయకు పలువురు సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యి, ఇంకా కూడా బీజేపీతో మైత్రి అవసరమా అంటూ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.

చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన అనంతరం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా మిత్రపక్షంగా టీడీపీని బీజేపీ గుర్తిస్తుందని, ఏపీకి ప్రత్యేకంగా నిధులు ఇస్తుందని ఎదురు చూశాం. కాని బీజేపీకి తమ అవసరం లేనట్లుగా ఉందని ఆయన పేర్కొన్నాడు. త్వరలో ఇతర పార్టీ నాయకులతో చర్చించి బీజేపీతో పొత్తు, స్నేహం విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా బడ్జెట్‌ కేటాయింపు విషయంలో ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు.