హైదరాబాద్లోని రోడ్ల పరిస్థితిపై తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టింది. ఆందోళనలో భాగంగా ఈరోజు నగర శివారులోని ఎల్లారెడ్డిగూడలో టీటీడీపీ నాయకుడు రేవంత్రెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి గుంతలు పడిన రోడ్లపై మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి వినూత్నంగా నిరసన తెలిపారు. నిరసన తెలుపుతున్న రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఈ సందర్భంగా రేవంత్రెడ్డి పోలీసులతో మాట్లాడుతూ… గుంతలు పూడ్చమంటే మమ్మల్ని అదుపులోకి తీసుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో తమపై దాడి చేయించవచ్చు కానీ, తమ పోరాటాన్ని ఆపలేరని అన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపించిన రేవంత్.. రోడ్ల దుస్థితితో ట్రాఫిక్ జాం ఏర్పడిందని, ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతోందని, అయినా సౌకర్యాలు మాత్రం లేవని విమర్శించారు.