తెలుగుజాతి వాడినీ, తెలుగువాడి వేడినీ విశ్వవ్యాప్తం చేసిన మహానాయకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కు ప్రపంచ తెలుగు మహాసభలలో తీరని అవమానం జరిగింది. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ సభలను తిరుపతిలో గురువారం నాడు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆదినుంచి ఈ సభల ఏర్పాట్లలో గానీ, ప్రణాళికలలో గాని రామారావు ప్రస్తావన లేకపోవటం బాధాకరం. ప్రారంభ వేడుకలలో రాష్ట్రముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గాని, ఇతర ప్రముఖులు గాని తమ ప్రసంగాలలో ఎన్టీఆర్ పేరును ప్రస్తావించక పోవటం సభలకు హాజరయిన వారికి తీవ్ర మనస్థాపాన్ని కలుగజేసింది.
ముఖ్యమంత్రి కిరణ్ తన ప్రసంగంలో అన్నమయ్య, శంకరంబాడి, పింగళి వెంకయ్య, మాజీ ప్రధాని పీ వీ నరసింహారావు, నీలం సంజీవరెడ్డి తదితరుల గురించి, వారి గొప్పతనాన్ని గురించి మాట్లాడారు గాని ఎక్కడా ఎన్టీఆర్ ఊసెత్తలేదు. తెలుగు భాషకు, తెలుగు రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిన రామారావు పేరు కూడా ప్రస్తావించని రాష్ట్ర పాలకుల వైఖరిని పలువురు ఖండించారు. బ్యానర్లలో గాని, ద్వారాల్లో గానీ, రామారావు బొమ్మ ఎక్కడా కనిపించలేదు. ఫోటో ఎగ్జిబిషన్ లో కూడా ఆయన ఫోటోలకు ప్రాధాన్యం లభించలేదు.
ఇక్కడ కూడా రామారావును రాజకీయ కోణంలో చూసారే గాని తెలుగు భాషకు చెందిన ఒక మహానుభావుడిగా అధికార కాంగ్రెస్ చూడలేదని సభలకు హాజరయిన పలువురు బాహాటంగానే విమర్శించటం విశేషం. ఇంత సంకుచిత దృష్టితో, రాజకీయ దృక్పధంతో సభలు నిర్వహించటం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. రామారావు పేరులేకుండా తెలుగు మహాసభలు నిర్వహించటం రాముడు లేకుండా రామాయణాన్ని ప్రస్తావించటం లా వుందని ఒక సాహితీవేత్త ఆవేదనగా అన్నారు.