కాంగ్రెస్ వారు ప్రజాద్రోహులు….చంద్రబాబు

ప్రభుత్వ నిధులు కాజేస్తూ కాంగ్రెస్ నాయకులు ప్రజాద్రోహులుగా మారారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపు ఇచ్చారు. పేదలకు మేలు జరగాలన్నదే తమ ధ్యేయమని, అందుకోసమే తాను పాదయాత్ర చేపట్టానని ఆయన తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలోని మల్లాపురం గ్రామంలో  ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఆడపిల్లలకు నిరుద్యోగ భృతి కల్పిస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలోని నారాయణ్ పేట నియోజకవర్గంలోని సేరి వెంకటాపురం, లింగాల చేడ్, సూరారం తదితర గ్రామాల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సూరారం గ్రామంలో ఎమ్మార్పి ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన సభలో ఆయన ప్రసంగిస్తూ వర్గీకరణ దిశగా తమ పార్టీ నిర్ణయం గైకొంటుందని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ డబ్బుల వసూళ్ళకు పాల్పడుతూ ఇష్టానుసారం కాలేజీలకు అనుమతులిస్తోందని అన్నారు. అర్హత వున్నా ఉద్యోగాలు రాక యువత దిక్కుతోచని స్థితిలో వుందని బాబు ఆవేదన వ్యక్తం చేసారు.