డీఎస్సీ అభ్యర్థులకు చేదు వార్త..

మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు మొండి చేయి చూపించింది. గత కొంతకాలం గా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మరోసారి చేదు వార్తను తెలిపి వారి ఆగ్రహానికి లోనయింది. డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల వాయిదా పడినట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వయంగా ప్రకటించారు.

10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. వాయిదా వేయడానికి కారణం ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాకపోవడం వలనే అని ఆయన మీడియా కు తెలుపడం జరిగింది. ‘ఆర్థిక శాఖ కొన్ని కొర్రీలు పెట్టింది. మరిన్ని వివరాలు కావాలని అడిగింది. వాటికి సమాధానం ఇచ్చాం. త్వరలో అనుమతి రావొచ్చు. బీఎడ్‌ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టుల్లో కూడా ప్రాధాన్యం కల్పిస్తూ ఎన్‌సీటీఈ విడుదల చేసిన గెజిట్‌పై కూడా చర్చిస్తున్నాం. టెట్‌ కమ్‌ టీఆర్‌టీ నిర్వహించేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామ’ని మంత్రి చెప్పుకొచ్చారు.