మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించారు. 65 ఏళ్ల తర్వాత ఓ మాజీ క్రికెటర్ .. బీసీసీఐ బోర్డు పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి. ముంబైలో ఇవాళ జరిగిన సర్వసభ్య సమావేశంలో గంగూలీ బాధ్యతలు స్వీకరించారు. దీంతో సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ ప్యానల్ పదవీకాలం ముగిసింది.
ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శిగా, అరుణ్ ధుమాల్ ట్రెజరర్ గా బాధ్యతలను చేపట్టారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చిన్న సోదరుడే అరుణ్ ధుమాల్. గంగూలీతో పాటు వీరిద్దరూ కూడా ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు.
బీసీసీఐ పగ్గాలు చేపట్టిన గంగూలీ.. ఉత్తమ కెప్టెన్ అని రాయ్ కొనియాడారు. బెంగాల్ క్రికెట్ సంఘానికి కూడా అయిదేళ్లు బాధ్యతలు నిర్వర్తించారన్నారు. బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు గంగూలీ కన్నా బెటర్ ఎవరూ లేరని రాయ్ అన్నారు.