పైనల్లో ఓడిన సింధు..

ఒలింపిక్ రజత పతక విజేత, హైదరాబాద్ స్టార్ షట్లర్ పీవీ సింధు ఇవాళ జరిగిన థాయ్‌లాండ్ ఓపెన్ ఫైనల్లో జపాన్‌కు చెందిన ఒకుహర చేతిలో 15-21, 18-21 తేడాతో సింధు ఓడిపోయింది. రెండు గేముల్లోనూ ఒకుహర ఆధిక్యంలోనే కొనసాగింది. తొలిగేమ్‌లో 6-3తో ముందంజలో ఉన్న ఆమెను చేరుకునేందుకు సింధు తీవ్రంగా పోరాడింది. అయితే ఒకుహర ప్రతిసారీ రెండు పాయింట్ల ఆధిక్యంలోనే కొనసాగుతూ వచ్చింది.

18-15తో ఉన్న ఆమె వరుసగా 5 పాయింట్లు సాధించి తొలి గేమ్‌ కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లో తొలుత 6-2తో సింధు ఆధిపత్యం కొనసాగించింది. ఈ క్రమంలో పుంజుకున్న ఒకుహర 7-7, 9-9, 14-14, 18-18తో ఆమె ఆధిక్యాన్ని సమం చేస్తూ వచ్చింది. చివర్లో సింధును ఒత్తిడిలోకి నెట్టేసి 21-18తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచింది. మొత్తం 50 నిమిషాల పాటు పోరాడినా.. ఒకుహర అటాకింగ్ ప్లే ముందు సింధు నిలవలేకపోయింది.