దేశంలోని అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ్ అవార్డు ఈ ఏడాది బెంగాల్ నవలా రచయిత అమితవ్ ఘోష్కు దక్కింది. సాహిత్యంలో అత్యుత్తమ సేవలు అందించిన అభినవ్ ను ఈ ఏడాది జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ మేరకు జ్ఞానపీఠ్ కమిటీ ఓ ప్రకటన విడుదల చేశారు.
అమితవ్ ను ఓ చరిత్రకారుడిగా, సామాజిక మానవ శాస్త్రజ్ఞుడిగా అభివర్ణించిన జ్ఞానపీఠ్ నిర్వాహకులు, చరిత్రను ఆధునిక యుగానికి తగినట్టుగా నవలగా రాయడంలో ఘోష్ అందెవేసిన చెయ్యి అని ప్రశంసించారు. కాగా, ‘షాడో లైన్స్’, ‘ది గ్లాస్ ప్యాలెస్’, ‘ది హంగ్రీ టైడ్’, ‘రివర్ ఆఫ్ స్మోక్’, ‘ఫ్లడ్ ఆఫ్ ఫైర్’, ‘సీ ఆఫ్ పాపీస్’ తదితర రచనలు చేశారు. ‘ది గ్లాస్ ప్యాలెస్’, ‘సీ ఆఫ్ పాపీస్’ నవలలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
జ్ఞాన్పీఠ్ పురస్కారానికి ఎంపిక చేసినందుకుగాను ఆయన ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇది నాకు అద్భుతమైన రోజు. ఈ జాబితాలో నాకు చోటు దక్కుతుందని ఎన్నడూ అనుకోలేదు’ అని ఆయన ట్వీట్ చేశారు. 1956లో కోల్కతాలో అమితవ్ జన్మించారు.