ముగిసిన తొలిరోజు ఆట.. 47 పరుగుల ఆధిక్యంలో ఆసీస్


భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్టు తొలిరోజు ఆటలో కంగారూలదే పైచేయి. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన ఆసీస్ 12 పరుగుల వద్ద తొలి వికెట్ (ట్రావిస్ హెడ్-9) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఉస్మాన్ ఖవాజా- లబుషేన్ లు రెండో వికెట్ కు 96 పరుగులు జోడించారు. లబుషేన్ 31 రన్స్ చేసి 108వద్ద వెనుదిరగగా, ఆ కాసేపటికే ఖవాజా (60) కూడా పెవిలియన్ చేరాడు. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ కూడా 26 రన్స్ చేసి ఔటయ్యాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి 156 రన్స్ సాధించింది. ప్రస్తుతానికి ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో ఉంది. కామెరూన్ గ్రీన్-6; హాండ్స్ కాంబ్-7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇకపోతే ఆసీస్ కోల్పోయిన నాలుగు వికెట్లూ రవీంద్ర జడేజాకే దక్కడం గమనార్హం.