రోహిత్ శర్మ మతిమరుపు కొంప ముంచిందా ?

రెండు మ్యాచుల్లో వరుస విజయాలు సాధించిన టీమ్ ఇండియాకి మూడో టెస్ట్ లో షాక్ తగిలింది. స్పిన్‌ తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసేద్దామని ప్లాన్ చేసిన టీమ్‌ఇండియాకు అదే ప్లాన్ రివర్స్ కొట్టింది. బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో అద్భుత విజయాలను నమోదు చేసిన టీమ్‌ఇండియా .. మూడో మ్యాచ్‌లో మాత్రం ఆసీస్‌ చేతిలో ఓడి చతికిలపడింది.

ఈ ఓటమిపై సోషల్ మీడియాలో ఓ జోకు వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు రోహిత్ శర్మ. మొదట బ్యాటింగ్ చేసింది ఇండియా 109 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇదే ఇండియా ఓటమికి ప్రధాన కారణం. స్పిన్ కి అంతలా సహకరించిన పిచ్ పై మొదట బ్యాటింగ్ తీసుకోవడం ఏమిటో ఎవరికీ అర్ధం కాలేదు. ‘అసలే రోహిత్ శర్మకి మతిమరుపు ఎక్కువ. ఫీల్డింగ్ ఎంచుకోబోయి అలవాటులో పొరపాటుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు’’ అంటూ మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మీమ్స్ మాట పక్కన పెడితే.. ఇలాంటి పిచ్ పై టాస్ గెలిచి మరీ బ్యాటింగ్ తీసుకోవడమే ఓటమికి మొదటి కారణం అని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.