కొరియా ఓపెన్ లో భారత్ హవా.. ఫైనల్ చేరిన సాత్విక్-చిరాగ్ జోడీ..


కొరియా బ్యాడ్మింటన్ ఓపెన్ టోర్నీలో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. ఫైనల్స్ లో ప్రవేశించారు. సాత్విక్ చిరాగ్ జోడీ అద్భుతంగా ఆడి ప్రత్యర్ధులను మట్టి కరిపించారు. 21-15, 24-22 తేడాతో చైనా జంటను ఓడించారు. తుది పోరుకు అర్హత సాధించారు.

సెమీస్ పోరులో సాత్విక్ చిరాగ్ జోడీ గట్టి పోటీ ఎదుర్కొంది. లియాంగ్ వీ కెంగ్, వాంగ్ చాంగ్ జోడీ ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉంది. గతంలో అనేక సార్లు చైనా జోడీ చేతిలో పరాజయం పాలైన భారత జోడీ ఈ సారి తమ సత్తా చాటింది. అప్రతిహత విజయం అందుకుంది.

భారత బ్యాడ్మింటన్ రంగంలో సాత్విక్, చిరాగ్ జోడీ తిరుగులేని ముద్ర వేశారు. గత కొన్ని సంవత్సరాలుగా విజయాలతో పతకాల పంట పండిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ సైతం అనేక సందర్భాల్లో వీరిద్దరిపై ప్రశంసలు కురిపించారు. మెడల్స్ సాధించిన తర్వాత ప్రధాని నివాసంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి స్వయంగా అభినందించారు. వారిలో మరింత స్పూర్తి నింపారు.

దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న సాత్విక్, చిరాగ్ జోడీ ఈ ఏడాదిలో స్విస్ ఓపెన్, ఇండోనేషియా టోర్నీలను కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం మరో టైటిల్ సాధించడంలో నిమగ్నమై ఉన్నారు.