దేశ వ్యాప్తంగా ఇప్పటికే రెండు విడతల పోలింగ్ పూర్తి కాగా..ఈరోజు మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్ రనిప్లోని నిశన్ హయ్యర్ సెకండరీ స్కూల్ పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు.
ఈ సమయంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా ఆయన వెంట ఉన్నారు. అంతకముందు గాంధీ నగర్ వెళ్లిన మోడీ.. తన తల్లి నివాసానికి చేరుకుని అక్కడ ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. అక్కడి నుంచి అహ్మదాబాద్కు బయలుదేరారు. ఇక దేశంలోని 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 116 నియోజకవర్గాల నుంచి 1,640 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, ఎస్పీ నేత ఆజంఖాన్, బీజేపీ నేత జయప్రద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.