భారత్ లో అతి పెద్ద టెలికాం విలీనం ప్రకటన వచ్చింది. ఐడియా లో వొడాఫోన్ విలీనానికి ఐడియా బోర్టు ఆమోదం తెలిపింది. చాలా రోజుల నుంచి ఈ రెండు కంపెనీల మధ్య విలీన ప్రక్రియకు సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి.
ఈ రోజు ఐడియాలో వొడాఫోన్ ఇండియా విలీనానికి ఆమోదముద్ర పడింది. ఈ విలీనాన్ని బోర్డు ధ్రువీకరించినట్టు ఐడియా సెల్యూలార్ ప్రకటించింది. ఇదే విషయాన్ని వొడాఫోన్ ఇండియా మాతసంస్థ వొడాఫోన్ పిఎల్సి బిఎస్ఇ ఫైలింగ్లో ప్రకటించింది. రెండు సంస్థల ఏకీకరణతో ఇప్పటి వరకు అతిపెద్ద టెలికం ఆపరేటర్గా ఉన్న ఎయిర్టెల్ రెండో స్థానానికి పడిపోనుంది. విలీనం తర్వాత సంస్థలో వొడాఫోన్కు 45.1 శాతం, ఐడియా ప్రమోటర్లకు 4.9 శాతం వాటాలు ఉంటాయని ఐడియా ఓ ప్రకటన లో చెప్పింది.
రిలయన్స్ జియో మార్కెట్లోకి వచ్చిన తర్వాత పలు టెలికాం కంపెనీలు భారీగా దెబ్బతిన్నాయి. మార్కెట్లో తీవ్ర పోటీ నెలకొంది. దీంతో రెండు అగ్ర కంపెనీలు విలీనంపై చర్చలు జరిపి ఒక్కటయ్యాయి. కాగా విలీన ప్రకటనతో ఐడియా షేర్లు 5శాతానికి పైగా లాభపడటం గమనార్హం.