ఎప్పటికప్పుడు మార్కెట్లోకి సరికొత్త కార్లను తయారు చేసే ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ రెనో, తాజాగా క్విడ్ క్లైంబర్ పేరుతో ప్రత్యేకమైన మోడల్ కార్ ను విడుదల చేసింది. ఈ కారు ధరను రూ.4.3లక్షలు (ఎక్స్-షోరూం దిల్లీ)గా ప్రకటించింది. మ్యానువల్, ఆటోమేటెడ్ మ్యానువల్ ట్రాన్స్మిషన్(ఏఎంటీ) రెండు మోడల్స్ లోను ఈ కార్ అందుబాటులోకి రానుంది.
మ్యానువల్ వేరియంట్ ధర రూ.4.3లక్షలు కాగా, ఏఎంటీ ధర రూ.4.6లక్షలుగా సంస్థ తెలిపింది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్లైంబర్ రూపొందించినట్లు రెనో సంస్థ తెలిపింది. క్విడ్ క్లైంబర్ను గత ఏడాది ఆటో ఎక్స్పోలో మొదటిసారి ప్రదర్శించడం జరిగింది. ఈ మోడల్ను ముంబయి, చెన్నైల్లోని రెనో డిజైన్ స్టూడియోస్లో రూపొందించి అభివృద్ధి చేసినట్లు సమాచారం. ఈ కారుతో మరింత మంది వినియోగదారులు రెనో కస్టమర్లుగా మారతారని సంస్థ భావిస్తుంది. అదే విధంగా భారత్లో మార్కెట్ షేర్ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.