తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త సంవత్సరంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం దేశవ్యాప్తంగా విచ్చేసే భక్తుల తాకిడి పెరగనుండడంతో జనవరి 1 సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. విఐపిల దర్శనాలకు రేపు ఉదయం 4 గంటల నుంచి అనుమతి ఇస్తారు. టీటీడీ జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజు సర్వదర్శనం ఉదయం 7 గంటల నుంచి ఉంటుందని చెప్పారు. ఆర్జిత సేవలు నేటి నుంచి జనవరి 2 వరకు రద్దు చేసినట్లు తెలిపారు. ఈరోజు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశదర్శనం రద్దు చేశారు. తిరుమల వెంకన్న దర్శనానికి కొత్త సంవత్సరం ప్రారంభ రోజున (మంగళవారం) వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సర్వదర్శనం, కాలిబాట దర్శనం మినహా రూ. 300 దర్శనం వంటి ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల జేఈవో తెలిపారు. సర్వదర్శనం, 15 వేల మందికి కాలిబాట భక్తుల దర్శనం మాత్రమే అమలు చేస్తామన్నారు.